Online Cheating : ప్రస్తుత కాలంలో ఆన్లైన్ మోసాలు బాగా ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా పండగ సమయాల్లో భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుండడంతో చాలామంది ఆన్లైన్ షాపింగ్కే మొగ్గు చూపుతున్నారు. అయితే కొందరు సైబర్ నేరగాళ్లు దీనినే అవకాశంగా తీసుకుని ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో సామాన్యులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. వీటికి సంబంధించి పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా మోసాలు మాత్రం ఆగడం లేదు.
అయితే సైబర్ నేరగాళ్ల చేతిలో పలువురు సెలబ్రిటీలు కూడా మోసపోతుండడం గమనార్హం. ఇటీవల హీరో రాజశేఖర్ భార్య జీవితా రాజశేఖర్కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. జియో ఆఫర్ పేరుతో ఓ మోసగాడు ఆమె మేనేజర్ను మోసం చేశాడు. కొన్నాళ్ల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి జీవితకు ఫోన్ వచ్చింది. ఫారూఖ్ అంటూ పరిచయం చేసుకున్న అతను మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది నేనే అని మాటలు కలిపాడు. అయితే ఆ సమయంలో జీవిత బిజీగా ఉండడంతో తన మేనేజర్తో మాట్లాడమని చెప్పింది. దీంతో అతనితో మాట్లాడిన ఆ కేటుగాడు తనకు ప్రమోషన్ వచ్చిందని … జియోలో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ 50 శాతం డిస్కౌంట్ ఇప్పిస్తానని నమ్మించాడు.
కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా అతని వాట్సాప్ కు పంపి రూ.2.5 లక్షల ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు… రూ.1.25 లక్షలకే వస్తుందని చెప్పాడు. దీంతో అతని మాటలు నిజమనుకుని జీవిత మేనేజర్ రూ.1.25 లక్షల రూపాయలను మోసగాడి అకౌంట్ లోకి ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత అతనికి ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన రాకపోవడంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు అతని ఫోన్, ఆన్ లైన్ అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేసి చెన్నైకి చెందిన టి. నాగేంద్ర బాబుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా నాగేంద్ర పలు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.