Puri Jaganandh : ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ … తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇటీవల రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా … పూరీ తెరకెక్కించిన చిత్రం లైగర్. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. మూవీ ప్లాప్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టపోయారని సమాచారం. దీంతో నిర్మాత, దర్శకుడు పూరి, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య వివాదం రాచుకుంది. దీన్నికి సంబంధించి ఒక ఆడియో క్లిప్ కూడా ఈ మధ్య సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టింది.
ఈ మేరకు ఇటీవల పూరీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వారిపై కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ ప్రెస్ నోట్ లో… నేను ఎవడినైనా మోసం చేసానంటే, అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకుడిని మాత్రమే అని చెప్పుకొచ్చారు. గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి? ఊపిరి ఒదిలెయ్యటమే. గెలుపోటములు కూడా అంతే, ఒకటి వస్తే ఇంకోటి పోక తప్పదు. పడతాం-లేస్తాం, ఏడుస్తాం-నవ్వుతాం, ఎన్నో రోజులు ఏడ్చిన తరువాత జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే.
ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, ఊరు వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సన్నివేశాలు మాత్రమే. అందుకే లైఫ్ ని సినిమాలా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు. లైఫ్ లో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. ఒకవేళ అవి జరగకపోతే మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరోలా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే. మధ్యలో జరిగేది అంతా డ్రామా.. మీ పూరి జగన్నాధ్… అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రెస్ నోట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.