Samantha : స్టార్ హీరోయిన్ గా సమంత దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉండే సమంత ఇటీవల ఒక్కసారిగా సైలెంట్ అయిన విషయం తెలిసిందే. కాగా సామ్ వ్యాధితో బాధపడుతుండడమే దీనికి కారణమంటూ నెట్టింట వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక్క పోస్ట్తో అన్ని పుకార్లకు చెక్ పెట్టింది.
ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా తాను మ్యూసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది సమంత. చేతికి సెలైన్తో డబ్బింగ్ చెబుతున్న సమయంలో వెనకాల నుంచి తీసిన ఓ ఫొటోను షేర్ చేసిన సమంత పోస్ట్ చేసింది. ఈ మేరకు ‘‘యశోద ట్రైలర్కు మీ స్పందన బాగుంది. ముగింపులేని సవాళ్లు జీవితం ముందున్నాయి. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలలుగా మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్కు చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. అయితే నేను అనుకున్న సమయం కంటే ఇది ఇంకా ఎక్కువ సమయమే తీసుకునేలా ఉంది. అన్నిసార్లూ బలంగా ముందుకు వెళ్లలేమని నాకు తత్వం బోధపడింది. ప్రతీది స్వికరిస్తూనే పోరాటం చేస్తాను. నేను త్వరలోనే దీన్నుంచి కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి-చెడు రోజుల్ని చూశాను. అలాంటి పరిస్థితులను ఇంకొక్క రోజు కూడా భరించలేనేమో అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరోనే ఉంది’’ అని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది సామ్. ఈ పోస్ట్ చివరలో ‘ఐ లవ్ యూ’ అంటూ రాసుకొచ్చింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సామ్ ‘యశోద’, ‘ఖుషి’ అనే సినిమాల్లో నటిస్తోంది. త్వరలోనే సమంత అనారోగ్యం నుంచి కోలుకుని మళ్లీ తన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్ని అలరించాలని పలువురు సెలబ్రిటీలు కోరుతున్నారు.