Sonusood : సోనూసూద్ … ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు. కోట్లాది ప్రజల గుండెల్లో మనసు సంపాదించుకున్నగొప్ప వ్యక్తి. కరోనా లాక్డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు నటుడు సోనూసూద్. వేలాది మందికి ఆహారం అందించడంతో పాటు వాహనాల్లో వారి ఇళ్లకు చేర్చి అందరి మన్ననలు పొందాడు. సినిమాల్లో చేసేది విలన్ పాత్రలే అయినప్పటికీ… సాయం కావాలంటూ తన దగ్గరకు వచ్చిన వారందరికీ… ఇప్పటికీ సోనూసూద్ సాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా ముద్ర వేసుకున్నాడు. ఆయనకు ప్రస్తుతం ఉన్న ఫాలోయింగే వేరు. రీల్ లైఫ్ లో విలన్ గా అందర్నీ భయపెట్టే సోనూసూద్, రియల్ లైఫ్ లో మాత్రం అందరికి ఆపద్బాంధవుడు అవుతున్నాడు.
కోవిడ్ సమయం లోనే కాకుండా ఆ తరువాత కూడా సూద్ ఛారిటీ ఫౌండేషన్ ను స్థాపించి దేశ నలు మూలలకు తన సేవలను అందిస్తున్నారు. కాగా ఇటీవల సొసైటీ అచీవర్స్ అవార్డ్స్ – 2022 కార్యక్రమాన్ని తాజ్ శాంతాక్రూజ్లో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమం లోనే మహారాష్ట్ర ప్రభుత్వం సోనూసూద్ సేవా గుణాన్ని గుర్తించి ‘నేషన్స్ ప్రైడ్’ అవార్డుతో సత్కరించింది. కాగా ఈ అవార్డుని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చేతులు మీదగా సోనూ అందుకున్నాడు.
ఈ సంధర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ… వెనకబడిన కుటుంబాలకి ఆరోగ్యకరమైన ఒక మంచి జీవితాన్ని అందించడమే నా లక్ష్యం. ఈరోజు సూద్ ఛారిటీ ఫౌండేషన్స్ ప్రయత్నాలకు ఇంతటి గుర్తింపు లభిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.