డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలు, ఈ నెల 19న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఈవెంట్
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సి కల్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి, నిర్మాత ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫిలింఛాంబర్ ప్రాంగణంలోని దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ను ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ ఈవెంట్ డేట్ పోస్టర్ ను తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ – దాసరి గారు దర్శకుల సంఘానికే కాదు అన్ని సినీ కార్మిక సంఘాలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుకొచ్చేవారు. సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవారు. దాసరి గారి 151 సినిమా సందర్భంగా 151 మంది దర్శకులకు సన్మానం జరిపారు. ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్న కళాతపస్వి కె విశ్వనాథ్ గారు దాసరి గారి పుట్టినరోజుని డైరెక్టర్స్ డేగా జరపాలని సూచించారు. ఇద్దరు పెద్ద దర్శకుల మధ్య ఉన్న అనుబంధానికి గుర్తు ఈ సంఘటన. డైరెక్టర్స్ డే ఈవెంట్ ను ఈ నెల 19వ తేదీన జరబోతున్నాం. ఈ ఈవెంట్ సక్సెస్ కోసం మన యంగ్ డైరెక్టర్స్ అందరూ శ్రమిస్తున్నారు. వాళ్లందరికీ నా థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.