ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా చిత్రం స్వాతిముత్యం. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాత. బెల్లం కొండ గణేష్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. నూతన దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రముఖ నిర్మాత, హీరో గణేష్ తండ్రి బెల్లం కొండ సురేష్ చిత్ర బృందంతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.
నిర్మాత బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ.. స్వాతిముత్యం చిత్రంకు అద్భుతమైన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా అబ్బాయి గణేష్ తో స్వాతిముత్యం లాంటి ఒక మంచి సినిమా తీసిన నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, చినబాబు గారికి నా జీవితాంతం రుణపడి వుంటాను. మా అబ్బాయి గణేష్ ని తొలి చిత్రంతో హీరోగా ప్రేక్షకులు ఆదరించడం చాలా ఆనందంగా వుంది. అలాగే దర్శకుడు లక్ష్మణ్ ని కూడా యాక్సప్ట్ చేశారు. ఈ చిత్రంలో రావు రమేష్ , గోపరాజు, ఇలా అందరూ అద్భుతంగా చేశారు. చాలా మంచి కథ, కాన్సెప్ట్ వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని స్వాతిముత్యం మరోసారి రుజువుచేసింది.
పెద్ద సినిమాల మధ్య వచ్చిన స్వాతిముత్యం మంచి సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఆనందంగా వుంది. నెమ్మదిగా మొదలైన వసూళ్ళు శుక్రవారం నాటికి అద్భుతంగా పెరిగి స్టడీగా కొనసాగుతున్నాయి. ప్రేక్షకులు సినిమాని చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచి విజయాన్ని ఇచ్చారు. ఈ విజయం నా జన్మలో మర్చిపోలేను. మెగా ప్రేక్షకులకు మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు” తెలిపారు.