Entertainment ప్రముఖ హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య గారి పేరుతో ఏర్పాటు చేసిన స్టూడియోను తన చేతుల మీదుగా ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ అవకాశం తమకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపిన చిరు.. నటుడిగా తాను మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి అల్లు రామలింగయ్యే కారణమని పేర్కొన్నారు.
అయితే ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం హైదరాబాద్లో ఆయన తనయడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరు.. “మా మామయ్య గారు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నా… ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ కొద్దిమందికి మాత్రమే ఇలాంటి ఘనత లభిస్తుంది. అరవింద్, బన్నీ, శిరీశ్, బాబీ.. సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారంటే కారణం కొన్ని దశాబ్దాల క్రితం పాలకొల్లులో రామలింగయ్య గారి మదిలో మెదిలిన ఓ చిన్న ఆలోచన. నటనపై ఉన్న మక్కువతో మద్రాసు వెళ్లి.. నటుడిగా మంచి స్థానాన్ని సొంతం చేసుకోవాలని ఆయనకు వచ్చిన ఆలోచనే ఇప్పుడు పెద్ద వ్యవస్థగా మారింది. దానికి ప్రతిక్షణం ఆయన వారసులు అతన్ని తలచుకుంటూనే ఉండాలి.ఆయన కుమారుడు అల్లు అరవింద్ను నిర్మాతను చేయాలని గీతా ఆర్ట్స్ను స్థాపించి ఓ మార్గం చూపించారు. అల్లు స్టూడియోస్ లాభాపేక్ష కోసం ఏర్పాటు చేయలేదని నేను అనుకుంటున్నా. ఇది లాభాపేక్ష కంటే స్టాటస్ సింబల్. అల్లు అనే బ్రాండ్తో అల్లు రామలింగయ్య పేరును తరతరాలు గుర్తించుకునేలా దీన్ని నిర్మించారు. ఈ కుటుంబంలో నేను కూడా భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా” అని చిరంజీవి వివరించారు.
గండిపేట్లో 10 ఎకరాల్లో అల్లు స్టూడియోస్ను భారీ స్థాయిలో నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో.. ప్రపంచ స్థాయి సధుపాయాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. మూవీకి సంబంధించి అన్ని పనులు ఇక్కడే చేసుకునేలా ఏర్పాటు చేశారు అల్లు ఫ్యామిలీ.