Viral News : వివాహం అనేది కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువుల మధ్య ఎంతో కోలాహలంగా జరుపుకునే వేడుక. పెళ్ళిలో అతిధులకు ప్రేమతో విందులో రకరకాల ఆహార పదార్ధాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ వివాహ వేడుకలో రసగుల్లా తక్కువయిందని జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. చివరకు ఆ స్వీట్ల గొడవ కారణంగా ఒకరు మృతి చెందడంతో ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
ఉత్తర్ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా ఎత్మాద్పూర్ పట్టణం లోని మొహల్లా షాయిఖాన్ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ కుమార్తె పెళ్లి వేడుక జరుగుతోంది. వివాహ వేడుకలో రసగుల్లా తక్కువ అయ్యాయి. దీంతో స్వీట్స్ తమకు అందలేదని పెళ్లికూతురు తరపు వారితో వరుడు తరపు బంధువులు గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఇంతలో ఓ వ్యక్తి కత్తితో చెలరేగడంతో 22 ఏళ్ల సన్నీతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. “దాడిలో తీవ్రంగా గాయపడిన సన్నీని మొదట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సన్నీని ఆగ్రాలోని సరోజినీ నాయుడు మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు… అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు.
ఈ దాడిలో గాయాలపాలైన మరో ఐదుగురిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి గుప్తా తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.