Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన శైలిలో దూసుకుపోతూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకొని టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. మహేష్ తన సినిమాల తోనే కాక రియల్ లైఫ్ లో కూడా ఎన్నో మంచి పనులు, సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద పిల్లలకి ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. రెండు గ్రామాలని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఇలా ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు మహేష్. మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు ఈ శ్రీమంతుడు.
కాగా ఇప్పుడు తాజాగా మహేష్ బాబు తన ఫౌండేషన్ నుంచి మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మహేష్ దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ లో అన్ని సౌకర్యాలని అమర్చారు. తాజాగా అక్కడి పిల్లలకి కంప్యూటర్ క్లాసులు, డిజిటల్ లెర్నింగ్ కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. బుర్రిపాలెం గవర్నమెంట్ స్కూల్ లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, వారికి డిజిటల్ లెర్నింగ్ ఇస్తున్న ఫోటోలని నమ్రత శిరోద్కర్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
” మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచిపనికి శ్రీకారం చుట్టింది. ఒక అడుగు ముందుకేసి బుర్రిపాలెం స్కూల్ లో విద్యార్థులు కోసం డిజిటల్ లెర్నింగ్ కి కంప్యూటర్లు ఏర్పాటు చేసింది. ఇది చాలా గొప్ప రోజు” అని నమ్రత పోస్ట్ చేశారు. దీంతో మహేష్ బాబుని మరోసారి అంతా అభినందిస్తున్నారు. కాగా ఈ ఏడాదే మహేష్ సోదరుడు, తల్లి మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వారి కోసం మంచి పనులు చేయడం గ్రేట్ అంటూ అందరూ అభినందిస్తున్నారు.